Breaking News

క్షణాల్లో కరోనా నిర్ధారణ..


 ప్రపంచ వ్యాప్తంగా విరుచుకుపడుతున్న కరోనా వైరస్‌ మహమ్మారిని కట్టడి చేయడానికి విశ్వప్రయత్నాలు సాగుతున్నాయి. వీలైనంత తొందరగా వ్యాక్సిన్ రూపొందించి వైరస్ నుంచి రక్షించాలని జనం ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా, మరోవైపు ఇప్పటివరకు వైరస్‌ నిర్ధరణ కోసం ఆర్‌టీ-పీసీఆర్‌తో పాటు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులను వాడుతున్నారు. అయితే, తాజాగా స్మార్ట్‌ఫోన్‌ ఆధారంగా కేవలం అరగంట వ్యవధిలోనే కొవిడ్‌ నిర్ధరణ ఫలితాన్నిచ్చే నూతన సాంకేతికతను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వీటికి సంబంధించిన పరిశోధనా నివేదిక సెల్‌ జర్నల్‌లో ప్రచురించారు.

నూతన విధానంలో, క్యాస్‌13 ప్రోటీన్‌ను రిపోర్టర్‌ మాలిక్యూల్‌తో ముందుగానే కలిపి ఉంచి..

దీన్ని వ్యక్తి నుంచి శ్వాబ్‌ ద్వారా సేకరించిన కొవిడ్‌ శాంపిల్‌తో పరీక్షిస్తారు. ఈ శాంపిల్‌ ఉన్న పరికరాన్ని స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించినప్పుడు అది కరోనావైరస్‌కు కారణమైన సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను గుర్తిస్తుంది. అయితే, ఆ సమయంలో స్మార్ట్‌ఫోన్‌ కెమెరా మైక్రోస్కోప్‌గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని సులువుగా అందుబాటులోకి తెచ్చేలా.. పరీక్షను వివిధ రకాల మొబైల్‌ ఫోన్లకు అనుగుణంగా మార్చవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

కాగా,ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సాంకేతికత ప్రకారం, సేకరించిన నమూనాలోని వైరల్‌ ఆర్‌ఎన్‌ఏను డీఎన్‌ఏగా మార్చిన అనంతరం విశ్లేషించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ పద్ధతిలో సమయం ఎక్కువ తీసుకోవడంతో పాటు ఇది కాస్త క్లిష్టమైన పని. ప్రస్తుతం అభివృద్ధి చేసిన నూతన విధానంలో ఇలాంటి సమస్యలేవీ ఉండవని.. CRISPR నుంచి నేరుగా వైరల్‌ లోడ్‌ను గుర్తించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ వంటి పరీక్ష అవసరమైన సందర్భాల్లో ఈ నూతన సాంకేతికత ఎంతో దోహదపడుతుందని అమెరికాలోని గ్లాడ్‌స్టోన్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకుడు జెన్నీఫర్‌ డౌడ్నా వెల్లడించారు. తద్వారా వేగంగా, కచ్చితమైన ఫలితం పొందడం సాధ్యమవుతుందని స్పష్టంచేశారు.

అంతేకాకుండా, ఈ విధానంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ లేదా నెగటివ్‌ అని నిర్ధరించడంతో పాటు వైరల్‌ లోడ్‌ను కూడా అంచనా వేస్తుందని సైంటిస్టులు వెల్లడించారు. అంతేకాకుండా, కేవలం ఐదు నిమిషాల్లోనే కచ్చితమైన ఫలితాన్ని ఇస్తుందన్నారు. వైరల్‌ లోడ్‌ తక్కువగా ఉన్న శాంపిళ్లలో మాత్రం నెగటివ్‌ ఫలితం ఇచ్చేందుకు ఈ పరికరం 30నిమిషాల సమయం తీసుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ నూతన సాంకేతికతను అభివృద్ధి చేసిన జెన్నీఫర్‌ డౌడ్నా, 2020లో రసాయన శాస్త్రంలో నోబెల్‌ బహుమతి పొందినవారిలో ఒకరు కావడం విశేషం.