Breaking News

పోలవరం ప్రాజెక్టు అంచనాలపై కేంద్ర ఆర్థిక శాఖ మళ్లీ కొత్త రూలు

 



పోలవరం ప్రాజెక్టు అంచనాలపై కేంద్ర ఆర్థిక శాఖ మళ్లీ కొత్త రూలును ముంగిట వేసింది. 2017-18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయానికి అంగీకరించకుండా 2013-14 ధరల ప్రకారం అయ్యే వ్యయాన్ని చెల్లిస్తామని చెప్పినట్లు సమాచారం. ఇందులో కూడా తాగునీటి సరఫరా, విద్యుత్తు బ్లాక్‌ నిర్మాణానికి అయ్యే ఖర్చునూ మినహాయిస్తామని పేర్కొన్నట్లు తెలిసింది. దీనిపై అభిప్రాయం చెప్పాలని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖను తాజాగా కోరినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. తాజాగా ఆర్థిక శాఖ చేసిన ప్రతిపాదన ప్రకారం.. కేంద్రం ఇచ్చేది సగానికిపైగా తగ్గిపోనుంది. 2014కు ముందు చేసిన ఖర్చు, ఆ తర్వాత ఇప్పటివరకు కేంద్రం నుంచి వచ్చింది పోనూ రూ.అయిదారు వేల కోట్లకు మించి వచ్చే అవకాశం కనిపించడంలేదు. ఆర్థిక శాఖ నుంచి కేంద్ర జల్‌శక్తి శాఖకు ఇలాంటి ప్రతిపాదన వచ్చినట్లు తెలిసిందని.. తమకు గానీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి గానీ అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం లేదని ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ వర్గాలు తెలిపాయి.  పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2010-11వ ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం 16,010.45 కోట్లు వ్యయమవుతుందని మొదట అంచనా వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 2014లో ఈ ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా కల్పించింది. నిర్మాణంలో జాప్యం జరగడంతో మళ్లీ అంచనాలు సవరిస్తూ కొత్త ప్రతిపాదనలను కేంద్రం ముందుంచింది. 2013-14 ధరల ప్రకారం రూ.30,718.95 కోట్లుగా జలసంఘం నిర్ణయించింది. ఆర్థికశాఖ నియమించిన కమిటీ ఈ అంచనాలను పరిశీలించి 29,027.95 కోట్లకు తగ్గించింది. తర్వాత 2017-18 ధరల ప్రకారం అంచనాలను మళ్లీ కొత్తగా రూపొందించారు. దీంతో ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా కమిటీ రూ.55,656.87 కోట్లుగా నిర్ణయించింది. అంచనాల సవరణ కమిటీ దాన్ని రూ.47,725.24 కోట్లకు తగ్గించింది. ఈ మొత్తానికి కేంద్ర జల్‌శక్తి మంత్రి ఆమోదముద్ర వేసి ఆర్థిక శాఖకు పంపింది. ఇదే సమయంలో రూ.2,300 కోట్ల బిల్లుల చెల్లింపునకు సంబంధించిన ఫైలు కూడా జల్‌శక్తి శాఖ నుంచి ఆర్థిక శాఖకు వెళ్లింది.  అయితే, రూ.2,300 కోట్ల బిల్లుకు నిధులు విడుదల చేసే సమయంలో 2013-14 అంచనాల ప్రకారమే చెల్లిస్తామని ఆర్థిక శాఖ పేర్కొన్నట్లు సమాచారం. ‘ఇందులోనూ తాగునీటి పనులకు, విద్యుత్తు బ్లాక్‌ పనికి మినహాయించి ఇస్తామని మెలిక పెట్టింది కేంద్ర ఆర్థిక శాఖ. తాగునీటికి ప్రాజెక్టు నుంచి నీళ్లు కేటాయిస్తారు తప్ప వాటిని సరఫరా చేసే పనులు ప్రాజెక్టులో భాగం కాదని ఆర్థికశాఖ పేర్కొన్నట్లు సమాచారం. ఈ రెండు మినహాయిస్తే 2013-14 ధరల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం సుమారు రూ.20 వేల కోట్లకు కుదించుకుపోనుంది. కాగా, ఇందులో రూ.4,500 కోట్లు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందే ఖర్చు చేశారు. తర్వాత కేంద్రం సుమారు రూ.8 వేల కోట్లు ఇచ్చింది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న రూ.2,300 కోట్లు విడుదల చేస్తే మరో రూ.ఐదారువేల కోట్లు మాత్రమే అందనున్నాయి. అయితే, రూ.47,725.24 కోట్లకు ఆమోదించిన కేంద్ర జల్‌శక్తి శాఖ దీనిపై ఏం చేస్తుందో చూడాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.