ఎల్జీ నుంచి సరికొత్త ల్యాప్టాప్
ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ ఎల్జీ మరో అద్భుతమైన అవిష్కరణతో మార్కెట్ లోకి రాబోతుంది. ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ప్రఖ్యాత సంస్థ ఎల్జీ నుంచి సరికొత్త ల్యాప్టాప్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ల్యాప్టాప్లకు భిన్నంగా ఉండే దీనిని ఎంచక్కా చుట్టేసుకోవచ్చని తెలిపింది. 17 అంగుళాల పరిమాణంతో రాబోతున్న ఈ రోలబుల్ ల్యాప్టాప్ పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసినట్టు సమాచారం. అయితే, ఎల్జీ మాత్రం అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించలేదు. కానీ, అది చేసుకున్న పేటెంట్ దరఖాస్తు మాత్రం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.
ఈ రోలబుల్ ల్యాప్టాప్లో ఫోల్డబుల్ కీబోర్డ్, టచ్ప్యాడ్ ఉంటాయి.
మరోవైపు, వచ్చే ఏడాది నాటికి ఎల్జీ రోలబుల్ స్మార్ట్ఫోన్లను కూడా తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. 'ప్రాజెక్టు బి' కోడ్నేమ్తో వీటిని అభివృద్ధి చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇంకోవైపు, ఒప్పో కూడా ఇదే పనిలో ఉంది. 'ఒప్పో ఎక్స్ 2021 కాన్సెప్ట్ ఫోన్'ను రోలబుల్ ఓలెడ్ డిస్ప్లేతో తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది.
