ఈ కామర్స్ కంపెనీలకు పోలీసుల లేఖ
రాయ్ పూర్ జిల్లాలో కత్తిపోట్ల కేసులు ఎక్కువ కావడంతో ఈ కామర్స్ కంపెనీలకు పోలీసులు లేఖలు రాశారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు రాసిన లేఖలో మడత పెట్టేవి, బటన్ కత్తులను పంపిణీ చేయవద్దని కోరారు. రాయ్ పూర్ ఎస్ఎస్పి అజయ్ యాదవ్ ఈ లేఖలు రాశారు. గత రెండు వారాల్లో రాయ్ పూర్ లో రెండు డజన్ల కొద్ది కత్తిపోట్లకు గురైన ఘటనలు వెలుగు చూశాయి.
మైనర్లతో సహా 24 మంది నిందితులను పట్టుకున్నట్లు ఓ నివేదికలో వెల్లడించారు. ఆయుధాలతో అరెస్టయిన చాలా మంది నేరస్తులను ఆరా తీయగా..ఈ కామర్స్ వెబ్ సైట్ల నుంచి కత్తులు కొనుగోలు చేసినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు.
లేఖ రాయడంతో ఆయా రెండు కంపెనీలు స్పందించాయని, పోలీసులకు సహకరిస్తామని చెప్పాయని యాదవ్ వెల్లడించారు. రాయ్ పూర్ నుంచి కత్తులు ఆర్డర్ ఇచ్చిన వారి వివరాలను తెలియచేయాలని కంపెనీలను కోరారు. అమెజాన్, ప్లిఫ్ కార్ట్ ఎగ్జిక్యూటివ్ లను కలిసినట్లు వెల్లడించారు.
