రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకి నగర జనజీవనం అస్తవ్యస్థం
హైదరాబాద్ మహానగరం కుండపోత వర్షాలతో కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. నగర జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. తాజా పరిస్థితులను అంచనా వేసేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ.రామారావు స్వయంగా రంగంలోకి దిగారు ఇందులో భాగంగా ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. బైరామల్ గూడ ప్రాంతంలో నీటి మునిగిన ప్రాంతాల్లో ప్రజల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో హోం మంత్రి మహమూద్ అలీ, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో కలసి ఆయన పర్యటించారు. ముంపు ప్రాంతాల నుంచి నీటిని త్వరగా తరలించేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్.. అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లకు కేటీఆర్ పలు సూచనలు చేశారు. మరో రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. అనంతరం బైరామల్ గూడ కాలనీ సమస్యలపై ప్రజలతో మాట్లాడారు.
